ఒక ప్రాజెక్ట్ అనుకున్నాక ఆ కథకు తగ్గ నటీనటుల్ని, టెక్నీషియన్లని ఎంపిక చేసుకుని షూటింగ్ మొదలయ్యాక మధ్యలో అనుకున్న వారిని తప్పించి ఆ స్థానంలో మరొకరిని తీసుకుకోడడం ఈ మధ్య కాలంలో దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ ఎక్కువవుతోంది. గతంలో క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందించిన `గోవిందుడు అందరి వాడేలే` చిత్రం కోసం ముందు తమిళ నటుడు, పందేం కోడి, ముని చిత్రాల ఫేమ్ రాజ్కిరణ్ని ఎంపిక చేసుకున్నారు. సినిమాలో ఆయనది హీరో రామ్చరణ్కు తాత పాత్ర. కొంత వరకు షూటింగ్ కూడా చేశారు.
అయితే రషెస్ చూసిన చిరంజీవి క్యారెక్టర్కి ఆయన సూటవ్వలేదని, ఆ స్థానంలో మరో ప్రకాష్రాజ్ అయితే బాగుంటుందని చెప్పడంతో అర్థాంతరంగా ఆయనని తప్పించి ఆ పాత్రని ప్రకాష్రాజ్ చేత చేయించారు. సినిమా ఫలితం తెలిసిందే. అలాంటి సంఘటనే బాలీవుడ్ నటి నీనా గుప్తాకు ఎదురైంది. హిందీలో అక్షయ్కుమార్ హీరోగా `సూర్యవన్షీ` పేరుతో రోహిత్ శెట్టి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రోహిత్ శెట్టి, ధర్మా ప్రొడక్షన్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్తిస్తోంది.
అజయ్దేవగన్, రణ్వీర్సింగ్ కీలక అతిథి పాత్రల్లో నటిస్తుండగా, కత్రినాకైఫ్ హీరోయిన్గా నటిస్తున్నారు. నీనా గుప్తాని తల్లి పాత్ర కోసం తీసుకున్నారు. కొంత వరకు షూటింగ్ కూడా చేశారు. అయితే పాత్ర పరంగా సినిమాకు ఏ విషయంలోనూ కనెక్టివిటీ లేకపోవడంతో ఆమెని మధ్యలోనే తప్పించారట. తన తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తానని మాటిచ్చిన రోహిత్ శెట్టి ఆమెను సినిమా నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నటి నీనా గుప్తా మాత్రం స్పందించలేదు.