కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. గత కొంతకాలంగా సునీల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కంబ్యాక్ అయ్యేందుకు చేయని ప్రయత్నం లేదు. హీరోగా నటించేందుకు అనాసక్తిగా ఉన్న సునీల్ తన స్నేహితుడు త్రివిక్రమ్ ఇచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాల్లో సునీల్ నటించాడు. అయితే ఇవేవీ అతడి కెరీర్ మైలేజ్ ని పెంచే ఆఫర్లు అయితే కావని తేలిపోయింది.
ఓ వైపు కెరీర్ ని సరైన దారిలో పెట్టే ప్రయత్నంలో ఉన్న సునీల్ చిన్న పాటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. గత కొద్ది కాలంగా అతడిని అనారోగ్యం ఇబ్బంది పెడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారని తెలుస్తోంది.
ప్రస్తుతం సునీల్ .. `డిస్కోరాజా` చిత్రంలో నటిస్తున్నారు. అతడిపై షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. ఇకపోతే సునీల్ కాలికి చిన్న పాటి ప్రమాదంలో గాయం అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో శస్త్ర చికిత్స వల్ల కొన్నాళ్ల షూటింగుకి బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మరోసారి అతడు చికిత్స కోసం సినిమాలకు బ్రేకిస్తున్నారన్న ముచ్చటా సాగుతోంది. అలాగే సునీల్ తదుపరి కలర్ ఫోటో అనే చిత్రంలోనూ నటించనున్నారు. ఇందులో ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్రలో షాకివ్వనున్నాడట. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు పరిచయమవుతున్నారు.