కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయిన విషసయం తెలిసిందే. మూడు నెలల తరువాత దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అన్ లాక్ ప్రక్రియ మొదలు కావడంతో పలు కీలక రంగాలన్నీ మళ్లీ యాక్టివ్ అవుతున్నాయి. ఇదే క్రమంలో సినీ ఇండస్ట్రీ కూడా షూటింగ్లని మొదలుపెడుతుందని అంతా భావించారు కానీ ఇప్పటికీ వైరస్ తీవ్రత తగ్గకపోవడంతో సెట్లోకి రావడానికి స్టార్ హీరోలు భయపడిపోతున్నారు.
కావాలంటే మరి కొంత సమయం వేచి చూద్దామని, ఇప్పడు రిస్క్ చేయడం అంత మంచిది కాదని షూటింగ్లలో పాల్గొనడానికి ఆసక్తి చూపించడం లేదు. ప్రధానంగా మన టాలీవుడ్ స్టార్స్ సెట్స్కు రావడానికి ఇష్టపడటం లేదు. ఇదిలా వుంటే కోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ మాత్రం షూటింగ్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. సుదీప్ ఇటీవల ఓ కన్నడ చిత్రం కోసం హైదరాబాద్లో షూటింగ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో కోసం సెట్లోకి వచ్చారు.
ఇదిలా వుంటే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ఖాన్ ఏకంగా టర్కీలో తన సినిమా షూటింగ్ని మొదలుపెట్టారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `లాల్ సింగ్ చద్దా`. 1994లో వచ్చిన హాలీవుడ్ చిత్రం `ఫారెస్ట్ గంప్` చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. కరీనా కపూర్, మోనా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ టర్కీలో మొదలైంది. దీంతో షూటింగ్ లొకేషన్కి అమీర్ఖాన్ని చూడటానిక ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో అమీర్ ఖాన్ కొంత ఇబ్బందికి గురికావాల్సి వచ్చింది. లాక్డౌన్ తరువాత విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న రెండవ చిత్రమిది. అక్షయ్ కుమార్ నటిస్తున్న `బెల్ బాటమ్` షూటింగ్ ఇటీవలే లండన్లో మొదలైంది.