డైలాగ్ కింగ్ సాయికుమార్ నట వారసుడిగా తెరంగేట్రం చేశారు యువ హీరో ఆది సాయికుమార్. నేడు ఆది పుట్టిన రోజు. ఆ సందర్భంగా రెండు చిత్రాలు తెరపైకి రాబోతున్నాయి. రెండు చిత్రాలు ఇప్పటికే చిత్రీకరణ మొదలయ్యాయి. ఇందులో ఓ చిత్రానికి `శశి` అనే టైటిల్ని ఖరారు చేశారు. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ ని మేకర్స్ ఆది పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం విడుదల చేశారు.
ఆర్.పి.వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆది డిఫరెంట్ గెటప్లో కనిపించబోతున్నట్టు ఫస్ట్లుక్ని చూస్తే అర్థమవుతోంది. ఆది ఈ ఏనిమిదేళ్ల కెరీర్లో మొత్తం 13 చిత్రాల్లో నటించారు. రెండు మాత్రమే విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రేమకావాలి, లవ్లీ చిత్రాల తరువాత ఆది హిట్ అనే మాట విని దాదాపు ఏడేళ్లవుతోంది.
ఈ ఏడాదైనా విజయం తలుపుతడుతుందేమోనని మూడు చిత్రాల్లో నటించారు. బుర్రకథ, జోడీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. వచ్చే ఏడాదైనా తన గీత మారుతుందేమోనని గజినీలా మరో రెండు చిత్రాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇందులో శ్రీనివాస్ నాయుడు రూపొందిస్తున్న `శశి` సినిమాపై ఆది భారీ అంచనాలు పెట్టుకున్నారట. మరి ఆదిని `శశి` అయినా రక్షించి అతని కెరీర్కి కొత్త ఉత్సాహాన్ని అందిస్తాడేమో చూడాలి అంటున్నారు ఆయన సన్నిహితులు.
Credit: Facebook