దర్శకుడు కృష్ణ వంశీ బాలకృష్ణతో కలిసి సినిమా తీయాలని విశ్వప్రయత్నాలు చేశారు. దీనికి `రైతు` అని పేరు పెట్టారు కూడా. అమితాబ్ బచ్చన్ చేత కీలక మైన కలెక్టర్ పాత్రని చేయించాలని ప్లాన్ చేశారు. అమితాబ్ని వెళ్లి అడిగారు కూడా కానీ అది ఎందుకో కార్యరూపం దాల్చ లేదు. దీంతో కృష్ణ వంశీ ఈ మూవీ చేయడం కష్టమని, దీన్ని పక్కన పెట్టినట్టేనని అంతా భావించారు. అయితే కొంత విరామం తర్వాత దర్శకుడు కృష్ణ వంశీ ‘అన్నం’ అనే సినిమాను ఇటీవల ప్రకటించారు.
కృష్ణ వంశీకి ప్రధాన పాత్ర కోసం చిరంజీవి నుండి గ్రీన్ సిగ్నల్ లభించిందని కొన్ని రోజులుగా పుకార్లు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, తాను చిరంజీవిని సంప్రదించలేదని కృష్ణ వంశీ వెల్లడించారు. ఇందులో నటించే హీరో ఎవరన్నది ఇంకా వెల్లడి కానప్పటికీ దీనికి మరో ఆసక్తికరమైన పుకారు వెలుగులోకి వచ్చింది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ `అన్నం` కోసం సైన్ చేసినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.
కృష్ణ వంశీ `అన్నం` చిత్రానికి సంగీతం అందించడానికి ఎఆర్ రెహమాన్ అంగీకరించినట్లు తెలిసింది. అయితే దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, టెక్నీషియన్స్ గురించి వెల్లడించే వరకు ఈ పుకార్లు వస్తూనే వుంటాయని, వాటికి చెక్ పెట్టాలంటే కృష్ణ వంశీ క్లారిటీ ఇవ్వాల్సిందేనని అంటున్నారు.