రౌడీ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి, చార్మి, కరణ్ జోహార్ త్రయం భారీ పాన్ ఇండియా సినిమాని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో భారీగా రిలీజ్ చేయాలన్నది ప్లాన్. అందుకు తగ్గట్టే స్క్రిప్టును వందశాతం రెడీ చేసుకుని పూరి, చార్మి టీమ్ ముంబై లొకేషన్లను జల్లెడ పడుతున్నారని వార్తలొచ్చాయి.
ఇక ఈ చిత్రంలో విజయ్ లుక్ ని ఇటీవలే చిత్ర బృందం ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. కథానాయికగా జాన్వీని నటింపజేయాలని పూరి నానా తంటాలు పడుతున్నారు. తనకోసమే షూటింగ్ ని ముంబైకి షిఫ్ట్ చేశాడట. కానీ ఆమె డేట్స్ లభించే అవకాశాలేవీ కనిపించడం లేదు. ఈ విషయంలో కరణ్ జోహర్ హెల్ప్ చేస్తే తప్ప జాన్వీ ఓకే చెప్పే అవకాశాలు తక్కువే అని లేటెస్ట్ సమాచారం. ఇదిలా వుంటే ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ అన్ని విధాలుగా సిద్ధమవ్వడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోబోతున్నారు.
దీని కోసం థాయ్లాండ్కు వెళుతున్నారయన. అక్కడ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోనున్నారని తెలుస్తోంది. 15 మంది టాప్ ఫైటర్స్ తనకు మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ నివ్వనున్నారట. దానికోసం విజయ్ పూర్తిగా స్లిమ్ అవుతున్నాడు. 2021 వేసవి లో ఈ సినిమాని రిలీజ్ చేయాలన్నది పూరి-కరణ్ ప్లాన్గా తెలుస్తోంది. ఈ నెలాఖరున ఈ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు.